ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ బెర్త్ను టీమిండియా తృటిలో చేజార్చుకుంది. న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన టీమిండియా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయింది. ఈ టోర్నీని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్.. విజేతగా నిలవలేకపోయింది.
ఐసీసీ తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 టోర్నీ జూన్ నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా.. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్తో డబ్ల్యూటీసీ 2025-27ని ప్రారంభించనుంది. ఈ సైకిల్లో టీమిండియా.. ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లనుండగా.. సొంతగడ్డపై వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో విజేతగా నిలిస్తే.. టీమిండియాకు డబ్ల్యూటీసీ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ సిరీస్ లాస్ట్ ఛాన్స్..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫామ్ అంత గొప్పగా లేదు. అయితే ఈ ఇద్దరితో పాటు మిగతా సీనియర్ ఆటగాళ్లకు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆఖరి ఛాన్స్గా మారనుంది. ఈ సిరీస్లోని ఆరంభ మ్యాచ్ల్లో విఫలమైతే.. సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసేందుకు బీసీసీఐ రెడీగా ఉంది. బుమ్రా ఫిట్ అయితే జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు. అతనితో పాటు మహమ్మద్ షమీ కూడా ఇంగ్లండ్తో సిరీస్ ఆడే అవకాశం ఉంది.
శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా.. టీమిండియా టెస్ట్ టీమ్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్.. టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియా కాంబినేషన్ ఏంటంటే..?
తదుపరి డబ్యూటీసీ సైకిల్లో టీమిండియా కాంబినేషన్ ఇలా ఉండనుంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రోహిత్ శర్మ జట్టులో ఉన్నా.. అతను డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ వరకు కొనసాగే అవకాశం లేదు. విరాట్ కోహ్లీ ఫామ్పై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. మెరుగ్గా రాణిస్తే.. అతను జట్టులో కొనసాగుతాడు.
ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా ఆడనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా ఫస్ట్ ఛాయిస్ పేసర్లుగా బరిలోకి దిగనున్నారు. షమీ ఫిట్నెస్, ప్రదర్శనపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ బ్యాకప్ బ్యాటర్లుగా అవకాశాలు అందుకోనుండగా.. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బ్యాకప్ పేసర్లుగా ఎంపికవ్వనున్నారు. వాషింగ్టన్ సుందర్ సెకండ్ ఛాయిస్ స్పిన్నర్ ఆల్రౌండర్ బరిలోకి దిగనున్నాడు.
తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో బరిలోకి దిగే భారత జట్టు:
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్.