హైదరాబాద్: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఓటమి అనంతరం నెల రోజుల సుదీర్ఘ విరామంలో ఉన్న టీమిండియా... వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
అయితే ఈ పర్యటన మొత్తానికి సీనియర్ ఆటగాళ్లను దూరంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తీరికలేని షెడ్యూల్తో అలిసిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలు ఈ పర్యటన మొత్తానికి దూరంగా ఉండనున్నారు.

వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ స్టార్ ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్కు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టును బీసీసీఐ సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పర్యటనలోని ఐదు టీ20 సిరీస్కు ఐపీఎల్లో సత్తా చాటిన రింకూ సింగ్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27న మూడు సిరీస్లకు సంబంధించిన జట్లను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

టీ20 ఫార్మాట్కు ఎంపిక చేసే జట్టులో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఎంపికవ్వనుండగా బ్యాకప్గా రుతురాజ్ గైక్వాడ్ను తీసుకోనున్నారు. ఐపీఎల్లో విఫలమైన దీపక్ హుడాపై వేటు వేయనున్న సెలెక్టర్లు అతని స్థానంలో యశస్వీ జైస్వాల్ను ఆడించే అవకాశం ఉంది.
సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనుండగా.. సంజూ శాంసన్ బ్యాకప్ కీపర్గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సంజూను కాదనుకుంటే జితేశ్ శర్మకు అవకాశం దక్కవచ్చు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ఎంపికవ్వనుండగా.. ఐపీఎల్లో సత్తా చాటిన రింకూ సింగ్కు ఈ సిరీస్లో అవకాశం దక్కనుంది.

స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్లు ఎంపికవ్వనుండగా.. పేసర్లుగా అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్లను పరిగణలోకి తీసుకోనున్నారు.
వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు(అంచనా):
శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుర్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్)/జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, రింకూ సింగ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/ శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.