హైదరాబాద్: డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఓటమి అనంతరం నెల రోజుల పాటు సుదీర్ఘ విరామం తీసుకోనున్న టీమిండియా... వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి వెస్టిండీస్తో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ స్టార్ ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్కు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టును బీసీసీఐ సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందర్నీ ఈ ఒక్క ఫార్మాట్కే పరిమితం చేసి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడించాలనే ఆలోచన బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
'విండీస్ పర్యటనలో కొంతభాగమైనా కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సిరాజ్, షమీలకు విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఆసీస్తో టెస్టు సిరీస్, ఐపీఎల్ ఆతర్వాత డబ్ల్యూటీసీ ఇలా సీనియర్ ఆటగాళ్లు వరుసగా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో అలసటగా కనిపిస్తున్నారు.
ఈ కారణంగా విండీస్తో జరిగే టెస్టు లేదా పరిమిత ఓవర్ల సిరీస్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచన ఉంది. అయితే ఆటగాళ్లతో చర్చించాకే సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును అజింక్యా రహానే నడిపించనుండగా.. యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటు వేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన జట్టు వివరాలను ఈ నెల 27న ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టు:
శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్