న్యూఢిల్లీ: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో ప్రస్తుతం విరామం తీసుకుంటున్న టీమిండియా.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన మొత్తానికి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ టూర్కు సంబంధించిన జట్టు ఎంపికపై బీసీసీఐ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోయినా టీమ్ ఎంపికపై సెలెక్షన్ కమిటీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

సీనియర్ ఆటగాళ్లతో చర్చించిన అనంతరం ఈ పర్యటనకు సెలెక్టర్లు జట్లను ఎంపిక చేయనున్నారని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. వన్డే, టెస్ట్ టీమ్ల్లో సీనియర్లు ఆడినా.. టీ20ల్లో మాత్రం యువ ఆటగాళ్లకే అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టును బీసీసీఐ సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే.
వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుండగా.. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, యశస్వీ జైస్వాల్తో పాటు హర్షల్ పటేల్, జితేశ్ శర్మలను ఎంపిక చేయాలనుకుంటోంది. అయితే గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మతో పాటు బ్యాటర్ సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకోవాలని హార్దిక్ పాండ్యా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2023 ఫైనల్లో సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ అదే జోరును కనబరుస్తున్నాడు. మరోవైపు మోహిత్ శర్మ 25 వికెట్లతో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వెటరన్ పేసర్ను తీసుకోవాలని హార్దిక్ పాండ్యా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 కెప్టెన్ అయిన కొత్తలోనే హార్దిక్ పాండ్యా.. గుజరాత్ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లో ఒకరు ఉద్వాసనకు గురవ్వనున్నారు.
వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు(అంచనా):
శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/ సాయి సుదర్శన్, యశస్వీ జైస్వాల్, సూర్యకుర్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్)/జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, రింకూ సింగ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, మోహిత్ శర్మ, దీపక్ చాహర్.