బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్కు సిద్దమైంది. అక్టోబర్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ దక్కాలంటే తదుపరి 8 టెస్ట్ల్లో టీమిండియా 3 విజయాలు సాధించాలి.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు న్యూజిలాండ్తో సిరీస్ టీమిండియాకు సన్నాహకంగా ఉండనుంది. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకొనే న్యూజిలాండ్ సిరీస్కు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చీలమండ గాయం, సర్జరీతో దాదాపు ఏడాదిగా షమీ జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఫిట్నెస్ సాధిస్తేనే..!
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఫైనల్ రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఫిట్నెస్ టెస్ట్లు క్లియర్ చేస్తే టీమిండియాకు ఎంపికవ్వనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే షమీని భారత జట్టుకు ఎంపిక చేస్తామని, అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోమని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
షమీ మరోసారి గాయపడ్డాడని వార్తలు రాగా.. అతను ఘాటుగా స్పందించాడు. అసత్య వార్తలంటూ కొట్టిపారేసాడు. ఈ క్రమంలోనే షమీ రీ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ తడబడుతుండటంతో షమీ ఎంట్రీతో టీమిండియా పేస్ బలం పెరుగుతుందనే అభిప్రాయం కలుగుతోంది.
సేమ్ టీమ్ కొనసాగింపు..
ఒకవేళ షమీ.. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికవ్వకపోతే... నవంబర్ చివర్లో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి షమీని ఎంపిక చేయాలనే ప్రయత్నాల్లో బీసీసీఐ ఉంది. ఇక షమీ వ్యవహారం మినహా జట్టు ఎంపికలో ఎలాంటి సమస్యలు సెలెక్టర్లకు లేవు.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపు కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటింగ్ విభాగం బాధ్యతలు మోయనుండగా.. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికవ్వనున్నారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ కొనసాగనున్నారు.
నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్..
స్పిన్ ఆల్రౌండర్లుగా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ఎంపికవ్వనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ఎక్స్ట్రా పేసర్ యశ్ దయాల్ను కొనసాగించవచ్చు. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఈ సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు బెంచ్ బలాన్ని పెంచాలనే యోచనలో ఉన్న టీమిండియా.. అందులో భాగంగానే పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
మరోవైపు పేస్ ఆల్రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతని స్థానాన్ని నితీష్ కుమార్ రెడ్డితో భర్తీ చేయాలనే ఆలోచనతో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. ఇప్పటికే అయ్యర్.. ముంబై రంజీ టీమ్కు ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీలో ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికవ్వచ్చు.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాన, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్, మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి