
ఐపీఎల్ స్టార్స్కు చాన్స్..
సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో ఐపీఎల్ స్టార్స్కు అవకాశం దక్కనుంది. రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీషాతో పాటు ఆవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్లకు టీ20 జట్టులో చోటు దక్కనుంది. వీరితో పాటు జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర్ చాహల్, దీపక్ చాహర్లు రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సిరీస్ నుంచే తన బాధ్యతలను చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2022 టార్గెట్గా బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించనుంది. ఆ క్రమంలోనే ద్రవిడ్ను కోచ్గా నియమించింది. తద్వారా సత్తా చాటే ఆటగాళ్లకే జట్టులో చోటు ఉంటుందని సీనియర్ ఆటగాళ్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇక టీ20 సిరీస్కు ఎంపికయ్యే 15 మంది ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రుతురాజ్, పృథ్వీషా, రోహిత్ శర్మ
టీ20 ఫార్మాట్ తదుపరి కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు దాదాపు ఖారారు కావడంతో అతను న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే ఓపెనర్గా రోహిత్ బరిలోకి దిగుతాడు. ఇక అతనికి తోడుగా ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన రుతురాజ్ గైక్వాడ్ అవకాశం దక్కించుకోవచ్చు. 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదే జోరు కనబరుస్తున్నాడు. శ్రీలంక పర్యటనలోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన రుతురాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాకప్ ఓపెనర్గా పృథ్వీషాకు చోటు దక్కవచ్చు. సీనియర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ.. టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా పృథ్వీషాను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. షా ఐపీఎల్లో 479 రన్స్తో రాణించాడు.

మిడిలార్డర్లో ఆ నలుగురు..
మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లో పాటు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్లకు అవకాశం దక్కనుంది. తీరిక లేని షెడ్యూల్తో వరుసగా క్రికెట్ ఆడుతున్న రిషభ్ పంత్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో ఇషాన్ కీపర్గా వ్యవహరించనున్నాడు. అతనికి బ్యాకప్గా సంజూ శాంసన్ను తీసుకోనున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకొని శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్తో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఐపీఎల్లో మెరిసే శాంసన్.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలన్ని చేజార్చుకున్నాడు. ఈ సారైన అతను తన సత్తాను నిరూపించుకుంటాడో లేదో చూడాలి.

ఆల్రౌండర్లుగా వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్..
టీ20 ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతన్ని ఈ సిరీస్కు దూరంగా ఉంచనున్నారు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్ను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. హార్దిక్కు ప్రత్యామ్నాయంగా పనికొస్తాడని భావిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా వెంకటేశ్ అయ్యర్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించనున్న నేపథ్యంలో అక్షర్ పటేల్కు చోటు దక్కనుంది.

ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లు..
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముందుగా స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్ చోటు దక్కించుకోనున్నారు. రాహుల్ చాహర్ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఫామ్ కోల్పోయిన యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ సెకండాఫ్లో సత్తాచాటాడు. రవిచంద్రన్ అశ్విన్ టీమ్కు దూరమైననేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరు అక్షర్తో కలిసి మ్యాచ్ బరిలో నిలవనున్నారు. ఇక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో ఐపీఎల్ స్టార్స్ హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్లకు చోటు దక్కనుంది. భువనేశ్వర్ కుమార్కు కూడా మరో అవకాశం ఇవ్వవచ్చు.

న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే జట్టు(అంచనా)
1. రోహిత్ శర్మ(కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్


Click it and Unblock the Notifications
