టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాధించడంపై కన్నేసింది. శ్రీలంక పర్యటనతోనే సన్నాహకాలు కూడా షూరూ చేసింది. శ్రీలంక చేతిలో అనూహ్యంగా 2-0తో వన్డే సిరీస్ కోల్పోయినా.. టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఓవైపు పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సి ఉండగా.. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది.
తమ మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఒకే ఒక్క సిరీస్..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు పెద్దగా వన్డే సిరీస్లు లేవు. ఇంగ్లండ్తో మాత్రమే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఫిబ్రవరిలో జరగనుంది. ఇటీవల భారత జట్టు ప్రదర్శన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు వన్డే టీమ్లో చోటు కోల్పోయే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాల పేర్లు దాదాపు ఖరారవ్వగా.. మిగతా ఆటగాళ్లను మాత్రం వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

యశస్వి ఇన్.. రాహుల్ ఔట్
వైస్ కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ చోటుకు డోకా లేకున్నా.. టెస్ట్ సిరీస్ల్లో అతను మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయవచ్చు. శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు ఇప్పటికే టీ20, టెస్ట్ సిరీస్ల్లో కూడా చోటు కోల్పోయారు. రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్గా టెస్ట్ సిరీస్లు ఆడనున్నా.. వన్డే ఫార్మాట్లో సంజూ శాంసన్కు అవకాశాలు దక్కవచ్చు.
శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత జట్టులోకి రావాల్సిన అవసరం ఉంది. హెడ్ కోచ్ గంభీర్ సహకరిస్తే అతను టెస్ట్ జట్టులో చోటు దక్కవచ్చు. టెస్ట్ల్లో మెరుగ్గా రాణిస్తేనే వన్డేల్లోనూ కొనసాగుతాడు. ఉపఖండపు పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండటంతో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కనుంది.
కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో కొనసాగనుండగా.. రవి బిష్ణోయ్ మూడో స్పిన్నర్గా ఆడనున్నాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లు ఎంపికవ్వనున్నారు. హర్షిత్ రాణా వంటి యంగ్ బౌలర్కు కూడా చోటు దక్కవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ, రవి బిష్నోయ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా