ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను సమం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. 30 రోజుల తర్వాత ఆసియా కప్ 2025 బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్తో భారత తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనుండటంతో ఆసియాకప్ 2025ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం భారత ఆటగాళ్లు విశ్రాంతిలో ఉన్నా.. సెలెక్టర్లు జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఆగస్ట్ 20న ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించిన నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది రాగానే అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఆసియా కప్ 2025 బరిలోకి దిగే జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆసియాకప్ 2025కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ ప్రముఖ వార్త సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్లో బుమ్రా ఆడితే.. వెస్టిండీస్తో జరిగే తొలి టెస్ట్కు దూరంగా ఉండనున్నాడు. అక్టోబర్ 2-6 మధ్య అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో తొలి టెస్ట్ జరగనుంది.
టీమిండియా టీ20 టీమ్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. టాపార్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన శుభ్మన్ గిల్.. ఒక్కడే జట్టులోకి రీఎంట్రి ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి టాప్ స్కోరర్గా నిలిచిన సాయి సుదర్శన్కు కూడా నిరాశే ఎదురవ్వనుంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ నిరూపించుకున్నారు. పైగా అభిషేక్ శర్మ నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్కు నిరాశే ఎదురవ్వనుంది. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్గా సంజూ శాంసన్ సత్తా చాటడంతో వన్డేల్లో కీపర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్కు కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. బ్యాకప్ కీపర్గా ధ్రువ్ జురెల్, జితేష్ శర్మలో ఒకరికి చోటు దక్కనుంది.
పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఎంపికవ్వనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో దూబేకు పోటీలేకుండా పోయింది. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. గత టీ20 సిరీస్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్.. ఆసియాకప్లో మాత్రం సాధారణ ఆటగాడిగానే ఆడనున్నాడు. శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కనున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ సిరాజ్కు ఆసియాకప్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఆడనుండటంతో పాటు వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో సిరాజ్ను దూరంగా ఉంచనున్నారు. రెండో పేసర్గా అర్ష్దీప్ సింగ్ ఆడనుండగా.. మూడో పేసర్గా ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనివైపు సెలెక్టర్లు మొగ్గు చూపవచ్చు. అయితే అతనికి హర్షిత్ రాణా నుంచి గట్టి పోటీ ఉంది.
సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా/ ప్రసిధ్ కృష్ణ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ/ధ్రువ్ జురెల్