ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్తో భారత్ మ్యాచ్ ఆడవద్దని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సరిహద్దుల్లో సైన్యం పోరాడుతున్న సమయంలో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం సమంజసం కాదన్నాడు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని అభిప్రాయపడ్డాడు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియాకప్ 2025 వేదికగా జరిగే భారత్-పాక్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్తో మ్యాచ్లను యువరాజ్ సింగ్ సారథ్యంలో భారత లెజెండ్స్ బహిష్కరించింది. సెమీఫైనల్ చేరిన తర్వాత కూడా పాక్తో ఆడలేక టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో ఆసియాకప్ 2025పై అందరి దృష్టి నెలకొంది.

సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్, పాక్ జట్లు సెప్టెంబర్ 14న తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు మొత్తం మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. పాక్తో ఆడే విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన హర్భజన్ సింగ్.. పాకిస్థాన్తో ఆడవద్దని బీసీసీఐకి సూచించాడు. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేదేం లేదన్నాడు.
'ఏది ముఖ్యమో.. ఏది కాదో తెలుసుకోవాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. నా వరకైతే.. సరిహద్దుల్లో పోరాడే సైనికులే ముఖ్యం. వారి త్యాగాల వల్ల దేశంలో మనమంతా హాయిగా ఉండగలుగుతున్నాం. సైనికుల త్యాగాలతో పోల్చితే పాక్తో మ్యాచ్ అనేది చాలా చిన్న విషయం. భారత ప్రభుత్వ వైఖరి కూడా అలానే ఉంది. బార్డర్లో సైన్యం పోరాడుతున్న వేళ పాక్తో క్రికెట్ ఆడటం సమంజసం కాదు.
పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పోలిస్తే క్రికెట్ చాలా చిన్న విషయం. ఎప్పుడైనా సరే దేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఆటగాడు, యాక్టర్కు అయినా గుర్తింపు రావడానికి ఈ దేశం ప్రధాన కారణం. ఇతర వృత్తిలో ఉన్నా దేశం కంటే ఎవరూ గొప్ప కాదు. దేశానికి ఇచ్చే ప్రాధాన్యతతో పోల్చినప్పుడు.. ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడకపోతే ఏమీ కాదు. బోర్డర్లో మన సైనికులు నిరంతరం కాపు కాస్తూ.. శతృ దేశంతో పోరాడుతున్నారు. వారు ఎప్పుడు ఇంటికి వస్తారా? అని వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న క్రమంలో మనం ఆ దేశంతో క్రికెట్ ఆడాలా?'అని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.