టెస్ట్ క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. పరుగుల పరంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికాతో బుధవారం గౌహతి వేదికగా ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 408 పరుగుల తేడాతో చిత్తయ్యింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఘోర పరాజయం.
549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27/2 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(6/37) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు.
2004లో నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 342 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘోర పరాజయంగా ఉండగా.. తాజా ఫలితం ఈ చెత్త రికార్డ్ను అధిగమించింది.
సొంత గడ్డపై జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటర్లు సెంచరీ సాధించకపోవడం గత 29 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1995-96లో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయలేదు.