న్యూఢిల్లీ: సౌతాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియా పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత జట్టును అక్కడ పంపించాలా? వద్దా? అనే సందిగ్దంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాని తర్వాతే టీమిండియా పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. డిసెంబరు 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు టీమిండియా.. సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాతో.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
'ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతోన్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబరు 8న గానీ, 9న గానీ సౌతాఫ్రికా బయలు దేరాలని గతంలో నిర్ణయించాం. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న జొహన్నెస్ బర్గ్, సెంచూరియన్ సమీపంలోని ప్రిటోరియాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముంబై నుంచి నేరుగా చార్టర్డ్ ఫ్లైట్లో జొహన్నెస్ బర్గ్ చేరుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా 3-4 రోజులు క్వారంటెయిన్లో ఉండాల్సిందే. అందుకే, మ్యాచ్ల నిర్వహణపై సౌతాఫ్రికా క్రికెట్ అధికారిక వర్గాల నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే.. టీమిండియా పర్యటనపై మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
భారత్X సౌతాఫ్రికా షెడ్యూల్ ఇదే..
ఫస్ట్ టెస్ట్ : డిసెంబరు 17 నుంచి 21 వరకు - జొహన్నెస్ బర్గ్
రెండో టెస్టు : డిసెంబరు 26 నుంచి 30 వరకు - సెంచూరియన్
మూడో టెస్టు : జనవరి 3 నుంచి 7 వరకు - కేప్టౌన్
తొలి వన్డే : జనవరి 11న - పార్ల్
రెండో వన్డే : జనవరి 14న - కేప్ టౌన్
మూడో వన్డే : జనవరి 16న - కేప్ టౌన్
తొలి టీ20 మ్యాచ్ : జనవరి 19న - కేప్ టౌన్
రెండో టీ20 మ్యాచ్ : జనవరి 21న - కేప్ టౌన్
మూడో టీ20 మ్యాచ్ : జనవరి 23న - పార్ల్
నాలుగో టీ20 మ్యాచ్ : జనవరి 26న - పార్ల్