
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు కరోనా సెగ తగిలింది. మహమ్మారి కారణంగా ఈ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ నేరుగా పెర్త్కు వెళ్లి అక్కడే బయో బబుల్ సెక్యూరిటీలో ఉండి తమ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే పెర్త్ మైదానం ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కరోనాకు సంబంధించి కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. క్రికెట్ జట్టుకైనా సరే... ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో భారత జట్టు ప్రణాళిక మారడం ఖాయమైంది. తాజా ప్రతిపాదన ప్రకారం భారత జట్టు తమ తొలి మ్యాచ్ అడిలైడ్ లేదా బ్రిస్బేన్లలో ఆడనుంది.
ఈ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ 'జంబో' జట్టును పంపే అవకాశాలున్నాయి. కరోనాను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 23 నుంచి 25 మందితో భారీ బృందాన్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. బయో బబుల్ కారణంగా నెట్ బౌలర్లు కూడా టీమ్తోనే ఉంటారని బోర్డు అధికారి తెలిపారు. అయితే, ఈనెల 30తో బీసీసీఐ సెలెక్టర్లు దేవంగ్ గాంధీ, జతిన్ పరంజపే, శరణ్దీప్ సింగ్ల నాలుగేళ్ల పదవీ కాలం ముగియనుంది. కానీ, నూతన సెలెక్టర్ల ఎంపిక విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఆసీస్ టూర్కు వెళ్లే టీమిండియాను వీరే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక భారత్కు ఆతిథ్యం ఇచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఏకంగా రూ. 159 కోట్లు(30 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు) ఖర్చు చేయనుంది. కరోనా కారణంగా తీవ్ర కష్టాల్లో ఉన్న ఆ బోర్డు.. తమ బ్రాడ్కాస్టర్ ఛానెల్ తో ఒప్పందాన్ని నిలుపుకోవడం కోసమే భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో బీబీఎల్ ను నిర్వహించకూడదని మొదట సీఏ భావించింది. కానీ అలా చేస్తే బ్రాడ్కాస్టర్ తమ 300 మిలియన్ డాలర్ల (రూ. 1592 కోట్లు) ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే తమకు ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది అని భావించిన సీఏ ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి భారీ మొత్తం ఖర్చు చేయడానికి సిద్దమైంది.