న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరిగే రెండో టీ20లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. తొలి టీ20 తరహాలోనే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు తొలి టీ20లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని పుంజుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలి టీ20లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ రెండో టీ20 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. డారిల్ మిచెల్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అక్షర్ పటేల్ ఎడమచేతి చూపుడువేలికి గాయమైంది. బంతి బలంగా తాకడంతో రక్త స్రావమైంది. దాంతో మైదానం వీడిన అక్షర్ మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు.
అతని గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా తదుపరి కొన్ని మ్యాచ్లకు అక్షర్ పటేల్ను దూరంగా ఉంచే అవకాశం ఉంది. అదే జరిగితే అతని స్థానంలో రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు.

అక్షర్ పటేల్ మినహా.. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. 8 మంది బ్యాటర్లు, ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుందని, ఇదే కొనసాగిస్తామని తొలి టీ20 విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి తొలి టీ20 ఆడిన ఆటగాళ్లే రెండో మ్యాచ్లోనూ కొనసాగనున్నారు. దాంతో శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణాలకు మరోసారి నిరాశే ఎదురుకానుంది.
ఓపెనర్లుగా సంజూ, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. సంజూ నిరాశపర్చాడు. తిలక్ వర్మ గైర్హాజరీలో అవకాశం అందుకొని ఫస్ట్ డౌన్లో ఆడిన ఇషాన్ కిషన్ కూడా రాణించలేకపోయాడు. రెండో టీ20లోనైనా ఈ ఇద్దరూ చెలరేగాల్సి ఉంది. సూర్య ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. అయితే అతను ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ సత్తా చాటగా.. శివమ్ దూబే నిరాశపర్చాడు. అతను కూడా టచ్లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి తిరుగులేదు. పేసర్లుగా బుమ్రా, అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగనున్నారు.
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్)/కుల్దీప్ యాదవ్/రవిబిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.