ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ను వరణుడు మింగేయడంతో టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమైంది. మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య ఆసీస్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. వర్షం అంతరాయం కలిగించిన తొలి మ్యాచ్లో భారత్ బ్యాటర్లు దుమ్మురేపారు. అదే జోరును రెండో టీ20లోనూ కొనసాగించాలనుకుంటున్నారు. తొలి టీ20లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్రౌండర్తో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో టీ20లో తమ కాంబినేషన్ను మార్చుకునే ఛాన్స్ ఉంది.
మెల్ బోర్న్ పిచ్ సాధారణంగా పేస్కు అనుకూలంగా ఉంటుంది. ఇది బౌన్సీ పిచ్. బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకుంటారు. మైదానం పెద్దది కాబట్టి స్పిన్నర్లు వికెట్లు తీయకపోయినా.. పరుగులు నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. పిచ్ కండిషన్స్ను పరిగణలోకి తీసుకుంటే.. టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగవచ్చు. అప్పుడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలో ఒకరు బెంచ్కు పరిమితమవుతారు. అదనపు పేసర్గా అర్ష్దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు.

ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. తొలి టీ20లో ఈ ఇద్దరు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ ఏడాది పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తొలి మ్యాచ్తో టచ్లోకి వచ్చాడు. తనకు అచ్చొచ్చిన ఫస్ట్ డౌన్లో బరిలోకి దిగి దుమ్మురేపాడు. తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే మిడిలార్డర్లో ఆడనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కొనసాగనుండగా.. వికెట్ కీపర్గా సంజూకు ప్రాధాన్యత దక్కనుండటంతో జితేష్ శర్మకు మరోసారి నిరాశే ఎదురు కానుంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ జట్టులో కొనసాగనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే ఈ ఇద్దరిలో ఒకరు బెంచ్కు పరిమితమవుతారు. తొలి టీ20లో అర్ష్దీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాను ఆడించడం విమర్శలకు దారి తీసింది. కానీ అతను బ్యాటింగ్ చేయడంతో పాటు ఆసీస్ కండిషన్స్లో బాగా రాణించగలడనే కారణంతో తుది జట్టులోకి తీసుకున్నారు. మరోసారి బుమ్రాకు తోడుగా అతన్నే కొనసాగించనున్నారు.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి/అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.