ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0తో ఆతిథ్య ఆసీస్కు కోల్పోయింది. గురువారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కుల్దీప్ యాదవ్ లేకుండా బరిలోకి దిగడం, మూడు కీలక క్యాచ్లు నేలపాలు చేయడం, కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం, టాస్ ఓడిపోవడం టీమిండియా ఓటమిని శాసించాయి.
శనివారం సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. క్లీన్ స్వీప్పై ఆసీస్ గురిపెట్టింది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా తమ కాంబినేషన్లో మార్పులు చేసే అవకాశం ఉంది.

సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుదిరిగాడు. తన 17 ఏళ్ల వన్డే కెరీర్లో కోహ్లీ ఇలా వరుసగా డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఆఖరి మ్యాచ్కు కోహ్లీకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీనే స్వయంగా తప్పుకొని యశస్వి జైస్వాల్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగితే శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తాడు. ఆఖరి అవకాశంగా కోహ్లీకి మరో ఛాన్స్ ఇస్తే మాత్రం యశస్వి జైస్వాల్కు మరోసారి నిరాశే ఎదురవుతుంది.
స్పెషలిస్ట్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు. కుల్దీప్ యాదవ్ గైర్హాజరీతో టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేసర్లు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.అర్ష్దీప్ సింగ్, సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నారు. స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నా.. వారి ప్రదర్శన విజయానికి సరిపోవడం లేదు. నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ విఫలమవుతున్నాడు. తొలి వన్డేలో విఫలమైనా.. రెండో వన్డేలో హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని సీనియర్ ఆటగాళ్లు సూచిస్తున్నారు.
ఆఖరి వన్డేలో కుల్దీప్ యాదవ్ను ఆడించాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లో ఒకరిపై వేటు పడనుంది. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. కోహ్లీ, గిల్, రాహుల్ కూడా చెలరేగితే భారత్కు తిరుగుండదు. ప్రసిధ్ కృష్ణతో పాటు ధ్రువ్ జురెల్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి/కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.