ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దాంతో అడిలైడ్ వన్డే టీమిండియాకు చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్లో నిలవనుంది. లేదంటే సిరీస్ ఆసీస్ కైవసం కానుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బెంచ్కే పరిమితం చేసింది. బ్యాటింగ్ డెప్త్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 8 మంది బ్యాటర్లు ఎందుకు? అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. బ్యాటింగ్కు ప్రాధాన్యత ఇస్తే బౌలింగ్ బలహీనంగా మారుతుందని విమర్శించారు. ఈ క్రమంలోనే అడిలైడ్ వన్డేలో టీమిండియా కుల్దీప్ యాదవ్ను ఆడించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.

బంతి పాతబడిన తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. తొలి వన్డేలో విఫలమైన హర్షిత్ రాణాపై వేటు వేసి కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు. తద్వారా బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టం కానుంది. ఎక్స్ట్రా పేసర్గా నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతలు పంచుకోనున్నాడు. ముగ్గురు పేసర్లతో ఆడాలని నిర్ణయిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటు పడుతుంది. గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే ఛాన్స్ లేదు.
సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యారు. దాంతో రెండో వన్డేలో ఈ ఇద్దరూ ఎలా రాణిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలి వన్డేలో దారుణంగా విఫలమైనా.. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ మరోసారి ఓపెనింగ్ చేయనున్నాడు. తొలి వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన అడిలైడ్లో బ్యాట్ ఝులిపించాల్సి ఉంది.
శ్రేయస్ అయ్యర్ కూడా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాలి. వికెట్ కీపర్గా జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. బ్యాటింగ్ ఆల్రౌండర్గా నితీష్ జట్టుకు కావాల్సిన మెరుపులు మెరిపించాడు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలి.
తొలి వన్డేలో అక్షర్ పటేల్ అటు బ్యాటర్గా ఇటు బౌలర్గా సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగితే 9వ స్థానంలో ఆడుతాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ ఆడనున్నారు. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన బౌలర్లు రెండో వన్డేలో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. యశస్వి జైస్వాల్, ప్రసిధ్ కృష్ణతో పాటు ధ్రువ్ జురెల్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్.