ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా కుప్పకూలింది. పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడిన భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు. అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా రాణించడంతో టీమిండియా గౌరవ ప్రథమైన స్కోర్ అందగలిగింది. లేదంటే 100 పరుగుల్లోపే ఆలౌటయ్యేది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే శుభ్మన్ గిల్ను అంపైర్ ఔటివ్వగా రివ్యూతో బయటపడ్డాడు. కానీ మూడో ఓవర్లోనే శుభ్మన్ గిల్(5)ను హజెల్ వుడ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సంజూ శాంసన్(2)ను నాథన్ ఎల్లీస్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్(1), తిలక్ వర్మ(0)లను ఒకే ఓవర్లో హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. సూర్యకు ఒక లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్ వదిలేసాడు. కానీ మరుసటి బంతికే సూర్య ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ వికెట్ పారేసుకున్నాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి రాగా.. టీమిండియా పవర్ ప్లేలో 4 వికెట్లకు 40 పరుగులే చేసింది.
ఆచితూచి ఆడిన అక్షర్ పటేల్(7) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో హర్షిత్ రాణాతో కలిసి అభిషేక్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదిన అభిషేక్..23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో హర్షిత్ రాణా కూడా పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరూ 6వ వికెట్కు 56 పరుగులు జోడించిన తర్వాత హర్షిత్ రాణాను గ్జేవియర్ బార్ట్లెట్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే(4), కుల్దీప్ యాదవ్(0) తీవ్రంగా నిరాశపర్చగా.. వరుణ్ చక్రవర్తీ(0) సాయంతో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని నాథన్ ఎల్లిస్ అద్భుతమైన యార్కర్తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా రనౌటవ్వడంతో భారత్ 125 పరుగులకు కుప్పకూలింది.