న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో పోరుకు సిద్దమైంది. బుధవారం రాజ్కోట్ వేదికగా జరిగే రెండో వన్డేలో న్యూజిలాండ్తో ఆతిథ్య భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డే తరహాలోనే రెండో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలవాలనే పట్టుదలతో భారత్ జట్టు ఉంది. మరోవైపు విజయం కోసం ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్.. అదే పోరాటపటిమను కనబర్చి విజయాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. దాంతో రెండు వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే తొలి వన్డేలో గాయపడిన భారత స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చివరి రెండు మ్యాచ్లకు దూరమవడంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ ఆయుష్ బదోనిని ఎంపిక చేసింది. తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి రెండో వన్డేలోనూ నిరాశే ఎదురు కానుంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించడంతో తొలి వన్డేలో నితీష్ బెంచ్కే పరిమితమయ్యాడు. సుందర్ గాయపడటంతో రెండో వన్డేలోనైనా నితీష్కు అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ టీమ్మేనేజ్మెంట్ ఏరి కోరి పార్ట్టైమ్ బౌలర్ అయిన బదోనిని తీసుకోవడంతో తుది జట్టులో అతన్నే ఆడిస్తారనే విషయం స్పష్టమైంది. పైగా బదోని గంభీర్కు ఫేవరేట్ ప్లేయర్. తుది జట్టులో అతనికి చోటు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే నితీష్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు.
తొలి వన్డేలో నిరాశపర్చిన ప్రసిధ్ కృష్ణపై వేటు పడవచ్చు. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ ఆడవచ్చు.తొలి మ్యాచ్లో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఒకవేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగవు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. గిల్ హాఫ్ సెంచరీతో రాణించినా.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. తాను ఎంత విలువైన ఆటగాడో తొలి వన్డేతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన అయ్యర్ కూడా ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్లో రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపర్చాడు. అతను రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది.
కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా అదరగొట్టారు. సిరాజ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ కొత్త బంతితో అతను మరింత ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. తన మార్క్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంది. అర్ష్దీప్ సింగ్ రీఎంట్రీతో టీమ్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. టీమ్ కాంబినేషన్లో భాగంగా నితీష్ రెడ్డితో పాటు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది.
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్/ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.