ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత ఫీల్డర్లు తడబడ్డారు. చెత్త ఫీల్డింగ్తో పాకిస్థాన్కు భారీ స్కోర్ను సమర్పించుకున్నారు. ఏకంగా 4 క్యాచ్లు నేలపాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆదిలోనే భారీ ఉపశమనం లభించింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద్ ఫర్హాన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే అతను డకౌట్గా వెనుదిరిగేవాడు. కానీ అభిషేక్ శర్మ తప్పిదంతో బచాయించిన అతను భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ ఫకార్ జమాన్ను హార్దిక్ పాండ్యా తన మరుసటి ఓవర్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ క్యాచ్ వివాదాస్పదమైంది. సంజూ శాంసన్ అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు కనిపించింది. కానీ సంజూ గ్లోవ్స్ బంతి కిందకు ఉన్నాయని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై ఫకార్ జమాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

క్రీజులోకి వచ్చిన సైమ్ అయుబ్తో కలిసి ఫర్హాన్ చెలరేగాడు. వరుణ్ చక్రవర్తీ వేసిన ఐదో ఓవర్లో 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సైమ్ అయుబ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను కుల్దీప్ యాదవ్ వదిలేసాడు. ఈ అవకాశంతో అతను చెలరేగగా.. పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అనంతరం మరింత సమయోచితంగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడింది.
వరుణ్ చక్రవర్తీ వేసిన 8వ ఓవర్లో ఫర్హాన్కు మరో లైఫ్ లభించింది. ఈ ఓవర్ మూడో బంతికి అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్నను అభిషేక్ శర్మ అందుకోలేకపోయాడు. దాంతో అది సిక్సర్గా మారింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఫర్హాన్ మరో రెండు సిక్స్లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమ్ దూబే విడదీసాడు. సైమ్ అయుబ్(21) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హుస్సేన్ తలత్కు కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఫర్హాన్ను శివమ్ దూబే క్యాచ్ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నవాజ్, సల్మాన్ అఘా ఆచితూచి ఆడారు. క్రీజులో సెట్ అయిన తర్వాత బ్యాట్కు పనిచెప్పాడు. శివమ్ దూబే వేసిన 18వ ఓవర్లో నవాజ్ ఓ సిక్స్తో పాటు బౌండరీ బాది 17 పరుగులు పిండుకున్నాడు.
మహమ్మద్ నవాజ్(21)ను సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేయడంతో ఐదో వికెట్కు నమోదైన 34 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఫహీమ్ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే క్యాచ్ ఇవ్వగా.. శుభ్మన్ గిల్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే అతను 6 పరుగులకే వెనుదిరిగేవాడు. ఆఖరి ఓవర్లో ఫహీమ్ సిక్సర్ బాది జట్టు స్కోర్ను 170 పరుగుల మార్క్ ధాటించాడు.