ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు మార్గం సుగుమమైంది. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుందని ఐసీసీ గురువారం ప్రకటించింది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదే విధంగా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని పేర్కొంది. అతి త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపింది.
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరగనుంది. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతో భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది.

జనవరి 7 వరకు ఈ సిరీస్ జరగనుండగా.. ఆ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో తలపడే భారత వన్డే జట్టే ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతోంది.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఈ టోర్నీ ఆడుతాడు. ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకే అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ సిరీస్లో సత్తా చాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవుతాడు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ ఆడనుండగా..విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలు జట్టులో చోటు దక్కించుకోనున్నారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బ్యాకప్ ఓపెనర్గా, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు చోటు దక్కనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీతో పాటు సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపికయ్యే భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, శ్రేయస్ అయ్యర్.