ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్గా.. బ్యాటర్గా సత్తా చాటిన టీమిండియా టెస్ట్ సారథి శుభ్మన్ గిల్కు బీసీసీఐ ప్రమోషన్ ఇవ్వాలనుకుంటుంది. టీ20 ఫార్మాట్కు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ను ఆసియా కప్ 2025కు ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది. కొందరు మాజీ క్రికెటర్లు సైతం శుభ్మన్ గిల్ను మూడు ఫార్మాట్లకు సారథిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత టీ20 జట్టులో శుభ్మన్ గిల్కు చోటు లేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని కుర్రాళ్లతో కూడిన జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చింది. వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంది.
ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ను ఆసియా కప్లోకి తీసుకోవాలంటే మరో ఆటగాడిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతోనే శుభ్మన్ గిల్ కోసం టీమిండియా నెంబర్ 3 టీ20 స్పెషలిస్ట్, తెలుగు తేజం తిలక్ వర్మపై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు సమాలోచనలు చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.

శుభ్మన్ గిల్ కోసం తిలక్ వర్మను తప్పించడం భావ్యం కాదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. వాస్తవానికి గతేడాదిగా టీ20 ఫార్మాట్కు శుభ్మన్ గిల్ దూరంగా ఉన్నాడు. అతను చివరి టీ20 మ్యాచ్ను శ్రీలంకతో గతేడాది జూలైలో ఆడాడు. మరోవైపు తిలక్ వర్మ నెంబర్-3 బ్యాటర్గా సెంచరల మోత మోగించాడు. మిడిలార్డర్లో కీలకంగా మారాడు. అంతేకాకుండా శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు కూడా తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కింది. ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన తిలక్ వర్మ 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అతను నెంబర్ 2 ర్యాంక్లో కొనసాగుతున్నాడు.
టీమిండియా ఆడిన చివరి రెండు టీ20 సిరీస్లోనూ తిలక్ వర్మ దుమ్మురేపాడు. ముఖ్యంగా సఫారీ గడ్డపై వరుసగా(107*, 120*) రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో కాస్త తడబడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 16 మ్యాచ్ల్లో 31.18 సగటుతో 343 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే తిలక్ వర్మను తప్పించి శుభ్మన్ గిల్ను తీసుకోవాలనే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
శుభ్మన్ గిల్నే ఆసియా కప్ 2025కు దూరంగా ఉంచి వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్కు సిద్దం చేయాలనే ఆలోచనలో కూడా టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆసియా కప్ జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం ముంబై వేదికగా ఆసియా కప్ 2025 జట్టును ప్రకటించే అవకాశం ఉంది.