IND vs ZIM: ఇషాన్, తిలక్ విధ్వంసం..చిత్తయిన జింబాబ్వే! సిరీస్ భారత్ కైవసం!
జింబాబ్వే గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో టీ20లోనూ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు గెలుపొందింది. శనివారం హరారే వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20) మెరుపులు మెరిపించగా.. శ్రేయస్ అయ్యర్(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.

అనంతరం జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 32), ర్యాన్ బర్ల్(18 బంతుల్లో 2 ఫోర్లతో 20), మరుమని(19 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(3/17) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/30), ప్రిన్స్ యాదవ్(2/10) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీసారు.
ముందుగా బౌలింగ్లో తేలిపోయిన జింబాబ్వే ఆ తర్వాత బ్యాటింగ్లోనూ చేతులెత్తేసింది. భారత అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరగడంతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు భారత పార్ట్ టైమ్ బౌలర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మలను ఆడలేక వికెట్లు పారేసుకుంది. భారీ స్కోర్ను ఛేదించాలనే ఒత్తిడో ఏమో కానీ.. జింబాబ్వే బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆదివారం హరారే వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

