ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ..ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది.
పాకిస్థాన్కు చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా.. పాకిస్థాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ అవార్డ్స్ స్వీకరించారు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ను అభిషేక్ శర్మ అందుకున్నారు.
ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ సైమన్ డౌల్తో మాట్లాడారు. పాకిస్థాన్ కెప్టెన్ కూడా తమ ఓటమిపై స్పందించాడు. ఆ తర్వాత సైమన్ డౌల్.. ఫైనల్ వేడుక ముగిసిందని, టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా సుముఖంగా లేదని చెప్పారు. దాంతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుక ముగిసింది. ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా తర్వాత తీసుకుంటుందా? ఆసియా క్రికెట్ కౌన్సిల్కే వదిలేస్తుందా? అనేది చూడాలి.

ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు ఊహించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే పాకిస్థాన్కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాకిస్థాన్ ఆటగాళ్లకు టీమిండియా కనీసం కరచాలనం కూడా చేయలేదు. వారితో ఫొటోషూట్లో కూడా పాల్గొనలేదు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడామనే విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనే విషయాన్ని స్పష్టం చేసింది.