ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ రసవత్తరంగా మొదలైంది. గత మూడు టెస్ట్ల తరహాలోనే ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్(48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 37) విలువైన పరుగులు చేశారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్(12) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ ఓక్స్ ఓ వికెట్ తీసాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ కండిషన్స్పై ఆచితూచి ఆడారు. స్వింగ్, సీమ్ అవుతున్న బంతి నిదానంగా ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. సాధింకారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీని విడదీసేందుకు బెన్ స్టోక్స్ చేసిన ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. దాంతో టీమిండియా 26 ఓవర్లలో 78/0 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ను క్రిస్ వోక్స్ స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సాయి సుదర్శన్ సాయంతో యశస్వి జైస్వాల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాయి సుదర్శన్ కట్టుదిట్టమైన డిఫెన్స్తో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. స్పిన్నర్ లియామ్ డాన్ను బరిలోకి దించిన స్టోక్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
తన రెండో ఓవర్ తొలి బంతికే లియామ్ డాన్.. యశస్వి జైస్వాల్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. బెన్ స్టోక్స్ దెబ్బతీసాడు. కళ్లు చెదిరే డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. బంతి అంచనా వేయడంలో విఫలమైన గిల్.. షాట్ ఆడకుండా బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి పంత్ రాగా.. సాయి సుదర్శన్ ఆచితూచి ఆడి రెండో సెషన్ను ముగించాడు. దాంతో టీమిండియా 149/3 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్లో రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగగా.. సాయి సుదర్శన్ క్లాస్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 64.5 ఓవర్లలో 200 పరుగుల మార్క్ అందుకుంది. డ్రింక్ బ్రేక్స్ అనంతరం టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ను గ్రౌండ్ అంబులెన్స్లో బయటకు తీసుకెళ్లారు.
క్రీజులోకి జడేజా రాగా.. సాయి సుదర్శన్ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను స్టోక్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్తో కలిసి జడేజా ఆచితూచి ఆడాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు.