ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. తమ రెండో సూపర్-8 పోరులో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో నిలవనుంది. ఓడితే మాత్రం ఘోర పరాభావంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
జింబాబ్వేపై గెలవడం కష్టం కాకపోవచ్చు. కానీ సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. అంతేకాకుండా భారత్ రన్రేట్ కూడా భారీగా పడిపోయింది. చివరి రెండు మ్యాచ్లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు శ్రీలంకలోని స్లో పిచ్లపై ఆస్ట్రేలియాతో పాటు ఆతిథ్య జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే.. అదే తరహా పరిస్థితులు ఉండే చెన్నైలో భారత్కు గట్టి షాకివ్వాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా తమ కాంబినేషన్లో మార్పులు చేయనుంది. ఓపెనర్గా సంజూ శాంసన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అతను అభిషేక్కు జోడీగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇషాన్ మూడో స్థానంలో ఆడొచ్చు. ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా.. పవర్ ప్లేలో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్, అభిషేక్, తిలక్లకు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు.
కుడిచేతి వాటం బ్యాటరైన శాంసన్ను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. సంజూ బరిలోకి దిగితే రింకూ సింగ్పై వేటు పడే అవకాశం ఉంది. తండ్రి అనారోగ్యంతో అతను ఇంటికి తిరిగి వెళ్లి వచ్చాడు. ఫినిషర్గా అతను ఉండాలనుకుంటే అభిషేక్ శర్మ, తిలక్ వర్మలో ఒకరిపై వేటు పడనుంది.
మరోవైపు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ రావడం కూడా ఖాయమే. ఇక బౌలింగ్లో బుమ్రా సూపర్ ఫామ్ భారత్కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్తో కూడిన భారత బౌలింగ్ దాడిని తట్టుకుని నిలవడం జింబాబ్వేకు పెద్ద సవాలే. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది. శివమ్ దూబే సూపర్ ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా.