జింబాబ్వే పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా 24 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్కు సిద్దమైంది. హరారే వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే వేదికగా శనివారం జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో ఖంగుతిన్న టీమిండియా.. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది.
టీ20 ఫార్మాట్లో ఛాంపియన్ అయిన టీమిండియా.. కనీసం ఆ టోర్నీకి అర్హత సాధించని జింబాబ్వే చేతిలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు భారత ఆటగాళ్లు సైతం అవమానంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ తప్పిదాలను సవరించుకొని రెండో టీ20లో చెలరేగాలనే కసితో ఉన్నారు.

ఖలీల్ అహ్మద్పై వేటు..?
తొలి ఓటమి నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్లో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన ఖలీల్ అహ్మద్పై వేటు పడే అవకాశం ఉంది. మిగతా బౌలర్లంతా సత్తా చాటిన వేళ ఖలీల్ అహ్మద్(0/28) దారుణంగా విఫలమయ్యాడు.
ఓవర్కు 9కి పైగా పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి యువ పేసర్ హర్షిత్ రాణా లేదా తుషార్ దేశ్పాండేను తుది జట్టులోకి తీసుకోవచ్చు. తుషార్ దేశ్పాండేకు తొలి ప్రాధాన్యత దక్కవచ్చు.
సాయి సుదర్శన్కు చోటు..
బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేయాలనుకుంటే నిలకడగా ఆడగలిగే సాయి సుదర్శన్ జట్టులోకి రావచ్చు. అతని కోసం రుతురాజ్ గైక్వాడ్ లేదా రియాన్ పరాగ్ల్లో ఒకరిపై వేటు వేసే అవకాశం ఉంది. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ, మిడిలార్డర్లో రుతురాజ్ గైక్వాడ్ లేదా సాయి సుదర్శన్, రియాన్ పరాగ్లు ఆడవచ్చు.
ఫినిషర్గా రింకూ సింగ్, వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కొనసాగనుండగా.. పేసర్లుగా ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఆడనున్నారు. మూడో పేసర్గా హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండేలో ఒకరు బరిలోకి దిగుతారు.
ఒక్క మ్యాచ్కే మార్పులు చేయవద్దని భావిస్తే మాత్రం సేమ్ టీమ్ బరిలోకి దిగవచ్చు.
జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
శుభ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్/హర్షిత్ రాణా/తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్.
జింబాబ్వేతో తొలి రెండు టీ 20లకు భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా.