హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ సిరీస్ను గెలుచుకున్న టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం(జూలై 27) ప్రారంభం కానున్న తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో టీమ్ కాంబినేషన్పై టీమిండియా మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది.
మెగా టోర్నీకి ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్లను సన్నాహకంగా వాడుకోవాలనుకుంటోంది. మరోవైపు కనీస పోటీ ఇచ్చేందుకు విండీస్ సిద్దమవుతోంది. అయితే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ప్రయత్నిస్తే మాత్రం ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. టెస్ట్ సిరీస్లో లెఫ్టాండర్ యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ అదిరిపోయే ఆరంభాలను అందించాడు. అతను వన్డే జట్టులో లేకపోవడంతో ఇషాన్ను ఓపెనర్గా ఆడించే అవకాశం ఉంది.
ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో పాటు శతకాన్ని నమోదు చేశాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్లో ఒకరు ఆడే అవకాశం ఉంది. సూర్యకు వన్డేల్లో చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఈ కోణంలో ఆలోచిస్తే సంజూ జట్టులోకి రావచ్చు.
ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. చాహల్కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనుండగా.. మూడో పేసర్గా ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్లో ఒకరు అరంగేట్రం చేయనున్నారు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్/ముఖేశ్ కుమార్