హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి డొమినికా వేదికగా జరిగే తొలి టెస్ట్లో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ గడువు సమీపిస్తున్నా టీమ్ కాంబినేషన్పై టీమిండియా మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్తో పాటు వికెట్ కీపర్, ఓపెనింగ్ కాంబినేషన్పై తెగ చర్చలు జరుపుతోంది.
బౌలింగ్లో నలుగురు బౌలర్లపై స్పష్టత ఉన్నా.. ఐదో బౌలర్గా ఎవరిని తీసుకోవాలన్నదే సమస్యగా మారింది. ఈ ఒక్క స్థానం కోసం ముగ్గురు పేసర్లు జయదేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైనీ, ముకేశ్ కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి టెస్టు వేదికైన ద విండర్స్ పార్క్ (డొమినికా).. వేదికగా ఎక్కువ మ్యాచ్లు జరగలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో ఐదు టెస్టులు, నాలుగు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్లు మాత్రమే జరిగాయి.

చివరిసారి ఇక్కడ 2017లో టెస్టు మ్యాచ్ జరిగింది. అందులో పాకిస్థాన్ 101 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. ఆ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోపే ముగిసింది. పిచ్ స్వభావంపై అంచనాకు రావడానికి విండర్స్ పార్క్లో ఇటీవల టెస్టు మ్యాచ్లేమీ జరగలేదు. ఇదే టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
ఇక టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతో పాటు స్టార్ పేసర్లు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్లతో బరిలోకి దిగనుంది. అయిదో బౌలర్గా మూడో పెసర్ ఎవరా? అనేది తేల్చుకోలేకపోతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన నవదీప్ సైనీ టచ్లోకి వచ్చాడు. వేగం తగ్గకుండా సుదీర్ఘ స్పెల్స్ వేయడం అతనికి కలిసొచ్చే అంశం.
ఇక రంజీ క్రికెట్లో మంచి రికార్డున్న లెఫ్టార్మ్ పేసర్ ఉనద్కత్.. కుడిచేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఉనాద్కత్ సత్తా చాటాడు. మరోవైపు 29 ఏళ్ల ముకేశ్ గత మూడు రంజీ సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ముకేశ్కు అనుకూలించే విషయం. మరి టీమిండియా మేనేజ్మెంట్ ఈ ముగ్గురిలో ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.
బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న జయదేవ్ ఉనాద్కత్కే చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను కాదని ఇషాన్ కిషన్ను ఆడించే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడనుండగా.. శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే చాన్స్ ఉంది.