హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా పరాజయాల పరంపరం కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
వరుస పరాజయాలతో చతికిలపడిన టీమిండియా పంజా విసిరేందుకు సిద్దమవుతుండగా.. అదే జోరును కొనసాగించి ఆధిక్యాన్ని ట్రిపుల్ చేసుకోవాలని విండీస్ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది.

ఇక వరుస ఓటములతో టీమిండియా కాంబినేషన్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పేలవ బ్యాటింగ్తోనే టీమిండియా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. తెలుగు తేజం తిలక్ వర్మ మినహా మరే ఆటగాడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఓపెనర్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్కు చోటిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విండీస్ గడ్డపై టెస్ట్ల్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు. మూడు మ్యాచ్ల్లో అదే జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
అయితే జైస్వాల్ను జట్టులోకి తీసుకొస్తే ఎవర్నీ పక్కనపెట్టాలా? అనేది ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్కు సవాల్గా మారింది. శుభ్మన్ గిల్ను తప్పిస్తే ఓపెనర్లుగా ఇద్దరూ లెఫ్టాండర్లే ఉండనున్నారు. టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ అయిన సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెడితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. రెండు మ్యాచ్ల్లోనూ సూర్య దురదృష్టవశాత్తు ఔటయ్యాడు.
ఈ పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్మెంట్కు ఉన్న ఏకైక ఆప్షన్ సంజూ శాంసన్. లేదంటే పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న శుభ్మన్ గిల్ను పక్కనపెట్టి సూర్యతో యశస్విని ఓపెనింగ్ చేయించడమే. లేదంటే ఇషాన్ కిషన్ను మిడిలార్డర్లోకి పంపించి గిల్తో కలిసి యశస్వి ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మూడో టీ20లో యశస్వి జైస్వాల్కు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే తుది జట్టులో మార్పులు చేయకుండా బరిలోకి దిగాలని హార్దిక్ పాండ్యా భావిస్తే మాత్రం అతనికి మరోసారి నిరాశే ఎదురుకానుంది. కుల్దీప్ గాయం నుంచి కోలుకుంటే జట్టులోకి వస్తాడు. అప్పుడు రవి బిష్ణోయ్ ఉద్వాసనకు గురవుతాడు. ముకేష్ కుమార్ను పక్కనపెట్టాలనుకుంటే ఉమ్రాన్ మాలిక్, ఉనాద్కత్ల్లో ఒకరు తుది జట్టులోకి వస్తారు.
భారత్ తుది జట్టు(అంచనా)
యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్/ఉనాద్కత్, యుజ్వేంద్ర చాహల్