హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై వరుస పరాజయాలతో చతికిలపడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న చావోరేవో మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. లేకుంటే సిరీస్ విండీస్ వశం అవుతోంది.
ఈ క్రమంలోనే విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు హ్యాట్రిక్ విజయంతో సిరీస్ కైవసం చేసుకోవాలని విండీస్ భావిస్తోంది. తద్వార వన్డే, టెస్ట్ సిరీస్ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది.

విజయంపై కన్నేసిన టీమిండియా బ్యాటింగ్ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. తొలి రెండు టీ20ల్లో జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. ముఖ్యంగా ఓపెనర్ల వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే టీ20ల్లో పేలవ రికార్డు ఉన్న ఇషాన్ కిషన్పై వేటు వేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
సంజూ శాంసన్ రూపంలో వికెట్ కీపర్ ఉండటంతో ఇషాన్ కిషన్ను తప్పించి యశస్వీ జైస్వాల్ను ఆడించాలనుకుంటోంది. మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. గాయంతో రెండో టీ20కి దూరమైన కుల్దీప్ యాదవ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
వెస్టిండీస్ జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. రెండో టీ20లో బ్యాటింగ్ సందర్భంగా గజ్జలో గాయానికి గురైన జాసన్ హోల్డర్ బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతను ఫిట్గా ఉంటే బరిలోకి దిగుతాడు. లేకుంటే మరో ప్లేయర్ జట్టులోకి రానున్నాడు.
రెండో టీ20కి ఉపయోగించిన పిచ్నే ఈ మ్యాచ్కు ఉపయోగించనున్నారు. ఈ పిచ్ స్పిన్తో పాటు స్లోయర్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో వర్షం వస్తుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
తుది జట్లు(అంచనా)
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్/ఉనాద్కత్, యుజ్వేంద్ర చాహల్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, చార్లెస్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అకీల్, అల్జారి జోసెఫ్.