ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్కు సిద్దమైంది. తమ ఆఖరి సూపర్-8 పోరులో భాగంగా నేటి(ఆదివారం) రాత్రి కోల్కతా వేదికగా జరిగే మ్యాచ్లో వెస్టిండీస్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి.
గత టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత ఇరు జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు. ద్వైపాక్షిక టీ20 సిరీస్లో టీమిండియాను చివరిసారిగా ఓడించిన ఏకైక జట్టు కూడా వెస్టిండీస్. 2023 ఆగస్టులో భారత్పై విండీస్ టీ20 సిరీస్ గెలిచింది. అనంతరం భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. గత మూడేళ్లుగా ఇరు జట్లలో చాలా మార్పులు జరిగాయి. భారత్ బలం రెట్టింపు అవ్వగా.. వెస్టిండీస్ కూడా పటిష్టంగా మారింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా వెస్టిండీస్ ఉంటే.. ఆ జట్టు కంటే 3 సిక్స్ల తక్కువతో రెండో స్థానంలో టీమిండియా ఉంది.
అయితే బలబలాల పరంగా టీమిండియానే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. విండీస్ కంటే భారత బౌలింగ్ విభాగం బలంగా ఉంది. మిస్టరీ స్పిన్తో పాటు వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు ఉన్నారు. అయితే తమదైన రోజున విండీస్ ఆపడం ఎంత పెద్ద జట్టుకైనా కష్టం.

ఈ కీలక పోరుకు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రత్యర్థి జట్ల ఆఫ్ స్పిన్ మంత్రానికి చెక్ పెట్టేందుకు సంజూ శాంసన్ బరిలోకి దించుతూ టీమిండియా మేనేజ్మెంట్ రచించిన వ్యూహం ఫలించింది. దాంతో సంజూ, అభిషేక్ శర్మనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్లో ఆడనుండగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మిడిలార్డర్లో ఆడనున్నారు.

జింబాబ్వే మ్యాచ్ తరహాలో టాప్-6 బ్యాటర్లు చెలరేగితే.. టీమిండియాకు తిరుగుండదు. శివమ్ దూబే, అక్షర్ పటేల్ లోయరార్డర్లో ఆడనున్నారు. బౌలింగ్లో విఫలమవుతున్న శివమ్ దూబేను తప్పించాలనుకుంటే రింకూ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. కానీ ఈ సాహసం టీమిండియా చేయకపోవచ్చు.
ఇక బౌలింగ్లో బుమ్రా సూపర్ ఫామ్ భారత్కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్తో కూడిన భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోవడం వెస్టిండీస్కు పెద్ద సవాలే. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ బెంచ్కే పరిమితం కానున్నారు.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా.
