శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా.. 24 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్కు సిద్దమైంది. పల్లెకెలె మైదానం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే రెండో టీ20లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదే జోరును రెండో టీ20లో కొనసాగించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. రెండో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తద్వారా ఆఖరి మ్యాచ్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది.

సంజూ, సుందర్లకు నిరాశే..
మరోవైపు అనూహ్యంగా తొలి టీ20లో ఓటమిపాలైన శ్రీలంక.. రెండో మ్యాచ్లోనైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే కసితో ఉంది. దాంతో రెండో టీ20 కూడా రసవత్తరంగా సాగి అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. రెండో టీ20కి టీమిండియా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించే అవకాశం ఉంది. దాంతో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
రియాన్ పరాగ్ వల్లే..
రియాన్ పరాగ్ను పార్ట్టైమ్ బౌలర్గా పరిగణిస్తుండటంతో సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు లేకుండా పోయింది. తొలి టీ20లో రియాన్ పరాగ్.. బ్యాటింగ్లో నిరాశపరిచినా.. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ మరోసారి బెంచ్కు పరిమితం కానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఒకే ఒక్క వికెట్ తీసిన అతను.. తీవ్ర గాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. బ్యాటర్ ఆడిన షాట్ను రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి అతని కంటి కింది భాగంలో బలంగా తాకింది. కాస్త పైకి తాకి ఉంటే అతనికి తీవ్ర గాయమయ్యేది. బ్యాండేజ్ వేసుకొని ఆటను కొనసాగించిన రవి బిష్ణోయ్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఒకవేళ గాయం తీవ్రమై అతనికి రెస్ట్ ఇస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడు. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆడనుండగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రియాన్ పరాగ్లు ఆడనున్నారు. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్గా బరిలోకి దిగనుండగా.. అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
శ్రీలంకతో రెండో టీ20 తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్