శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్.. ఈ సిరీస్తోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలను ప్రారంభించనున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సిరీస్కు సీనియర్లు అందర్నీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరితో పాటు వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చేయనున్నారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బ్యాటర్లు ఎవరంటే..?
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. వికెట్ కీపర్గా రిషభ్ పంత్కు బదులు కేఎల్ రాహుల్కు అవకాశం దక్కనుంది. రాహుల్తో కీపింగ్ చేయిస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకు లభించనుంది. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషభ్ పంత్కు ప్రాధాన్యత దక్కనుంది.
ముగ్గురు ఆల్రౌండర్లతో..
వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివమ్ దూబే తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్కు అవకాశం దక్కనుంది. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. దూబే ఆరో స్థానంలో ఆడనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. పేస్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ పంచుకోనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు.
శ్రీలంకతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ .