
కేఎల్ రాహుల్పై వేటు..
టోర్నీ ప్రారంభానికి ముందే టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు తుది జట్టులో మార్పులు చేర్పులు చేస్తామని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్పై వేటు పడే చాన్స్ ఉంది. ప్రస్తుతం అతను తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్తో కలిసి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం తుది జట్టులో మార్పులు ఉండవని సంకేతమిచ్చాడు. అంతేకాకుండా రిషభ్ పంత్కు సిద్దంగా ఉండాలని చెప్పామని, అవసరమైనప్పుడు జట్టులోకి తీసుకుంటామని తెలిపామని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో కేఎల్ రాహుల్కు చివరి అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ రాహుల్కు విశ్రాంతివ్వాలనుకుంటే పంత్ జట్టులోకి రానున్నాడు. అప్పుడు సూర్య ఓపెనింగ్కు వస్తే పంత్ మిడిలార్డర్లో ఆడనున్నాడు.

కోహ్లీపైనే అందరి ఫోకస్..
పాకిస్థాన్తో విరోచిత పోరాటం కనబర్చిన విరాట్ కోహ్లీ.. నెదర్లాండ్స్పై అదే జోరు కొనసాగించాడు. మరో హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. టోర్నీ ఆసాంతం అతను అదే జోరు కొనసాగిస్తే భారత్కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు. ఇక పాక్తో విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. నెదర్లాండ్స్తో ఫామ్లో వచ్చాడు. సూపర్ ఫిఫ్టీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ సైతం టచ్లోకి వచ్చాడు. నెదర్లాండ్స్తో హాఫ్ సెంచరీ బాదిన అతను అదే జోరు కొనసాగించాల్సి ఉంది.

హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్
ఐదో స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగనున్నారు. పాక్తో మ్యాచ్లో హార్దిక్.. విరాట్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే నెదర్లాండ్స్తో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. బౌలింగ్లోనూ ఒకే ఒక ఓవర్ వేసాడు. పాక్తో మ్యాచ్లో విఫలమైన కార్తీక్.. సౌతాఫ్రికాతో చాన్స్ వస్తే చెలరేగాల్సి ఉంది.

బౌలింగ్లో మార్పుల్లేవ్..
పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్లు కొనసాగడం ఖాయం. గత రెండు మ్యాచ్ల్లో బౌలర్లు పర్వాలేదనిపించారు. పాక్తో విఫలమైన అక్షర్ పటేల్.. నెదర్లాండ్స్తో అదరగొట్టాడు. అశ్విన్ సైతం రెండు వికెట్లతో రాణించాడు. ఇక సౌతాఫ్రికా జట్టులో లెఫ్టాండర్స్ ఉన్న నేపథ్యంలో అశ్విన్ తుది జట్టులో ఉండటం ఖాయం. దాంతో చాహల్ మరికొన్ని మ్యాచ్లు వేచి చూడాల్సిందే.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.


Click it and Unblock the Notifications
