India Playing XI vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురులేని ఆటతో వరుసగా ఏడు విజయాలు సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా ఇప్పుడు మరో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ఆదివారం జరిగే మ్యాచ్లో పటిష్ట సౌతాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే పాయింట్స్ టేబుల్లో టీమిండియాకు టాప్ ప్లేస్ దక్కుతుంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. భారత్ తరహాలోనే భారీ విజయాలతో సౌతాఫ్రికా జోరు మీద ఉంది. ఆ జట్టు ఏడు మ్యాచ్ల్లో 6 గెలిచింది. ఈ ఆరింటిలోనూ భారీ స్కోర్లు నమోదు చేసింది. ముఖ్యంగా ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు డికాక్, వాన్ డెర్ డస్సెన్, మార్క్రమ్ సూపర్ ఫామ్లో ఉన్నారు.

ఈ క్రమంలోనే సంచలన ప్రదర్శన కనబరుస్తున్న భారత పేస్ అటాక్ను సఫారీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. రెండు బలమైన జట్ల మధ్య జరగనున్న పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్తో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది.
ఇప్పటికే సెమీస్ చేరిన టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ మ్యాచ్కు కూడా దూరంగా ఉండనున్నాడు. నెదర్లాండ్స్తో జరిగే తదుపరి మ్యాచ్కు అతను అందుబాటులోకి వస్తాడని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై సత్తా చాటాడు.
మహమ్మద్ సిరాజ్ సైతం నిప్పులు చెరిగాడు. టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరమే లేదు. కానీ కోల్కతా పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే మాత్రం టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగవచ్చు. అప్పుడు తుది జట్టులోకి అశ్విన్ వస్తాడు. అదే జరిగితే సిరాజ్ బెంచ్కే పరిమితమవుతాడు.
ఈ ఒక్కటి తప్పా జట్టులో మార్పు చేసేందుకు ఆస్కారమే లేదు. భారత ప్రధాన పేసర్లలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటేనే శార్దూల్ జట్టులోకి వస్తాడు. పటిష్టమైన సౌతాఫ్రికాతో పోరులో టీమిండియా అనవసర ప్రయోగాలు చేసే అవకాశం లేదు. శుక్రవారమే కోల్కతా చేరిన టీమిండియా.. శనివారం ప్రాక్టీస్ చేయనుంది.
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్