India Playing XI vs SA for 2nd Test: సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు ఆతిథ్య జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనే టీమిండియా కల ఆవిరైంది.
ఈ ఘోర పరాజయాన్ని మరవకముందే టీమిండియా ఈ సిరీస్లోని చివరి మ్యాచ్కు సిద్దమైంది. కేప్టౌన్ వేదికగా జనవరి 3(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఘోర పరాజయంతో ఈ ఏడాదిని ముగించిన టీమిండియా.. రెండో టెస్ట్లో భారీ విజయం సాధించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలనే పట్టుదలతో ఉంది.

ప్రసిధ్ కృష్ణపై వేటు: పేలవ బ్యాటింగ్.. చెత్త బౌలింగ్తో తొలి టెస్ట్లో చిత్తయిన టీమిండియా తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది. తొలి టెస్ట్లో ఏ మాత్రం ప్రభావం చూపని టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్దమవుతోంది.
ప్రసిధ్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ను తీసుకోనుండగా.. శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో ఆవేశ్ ఖాన్ను ఆడించే అవకాశం ఉంది. సౌతాఫ్రికా-ఏ టీమ్తో జరిగిన అనధికారిక టెస్ట్లో ఆవేశ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్న అతను.. కేప్టౌన్ వేదికగా అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

అశ్విన్ ఔట్..: మహమ్మద్ షమీ స్థానంలో ఆవేశ్ ఖాన్ను జట్టులోకి తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్ను ఆడించాలనుకుంటే మాత్రం ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ల్లో ఒకరు బెంచ్కు పరిమితమవుతారు. ఫిట్నెస్ సమస్యలతో చివరి నిమిషంలో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా.. కేప్టౌన్ టెస్ట్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో అశ్విన్ను తుది జట్టు నుంచి తప్పించనున్నారు.

ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్: బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్ట్లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్ల్లోనూ శుభారంభం అందించలేకపోయారు. కేప్ టౌన్ టెస్ట్లోనైనా ఈ ఇద్దరు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. చతేశ్వర్ పుజారా లోటును శుభ్మన్ గిల్ తీర్చలేకపోతున్నాడు. తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అతన్ని మళ్లీ ఓపెనర్గా ఆడించి.. యశస్విని ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ పంపించవచ్చు. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడు.

మిడిలార్డర్లో ఎవరంటే..?: అజింక్యా రహానే లోటును శ్రేయస్ అయ్యర్ నెరవేర్చలేకపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీతో కలిసి ఓ కీలక భాగస్వామ్యం నెలకొల్పినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కేప్టౌన్ పిచ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు సరిగ్గా సరిపోతుంది. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విరోచిత శతకంతో రాహుల్ ఆకట్టుకున్నాడు.
కేప్టౌన్ వికెట్ కూడా పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్కు అండగా ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ఆవేశ్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్
భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్.