India Playing XI vs SA for 1st Test: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ విజయంతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా మంగళవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నదమవుతోంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని నెంబర్ వన్ టెస్ట్ టీమ్ అయిన టీమిండియా.. ఈ సారి ఆ కోరికను తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్తో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీ..
వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గాయం నుంచి కోలుకోకపోవడంతో చివరి నిమిషంలో స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్కు దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ స్వదేశం వెళ్లిపోయాడు. అతని స్థానంలో కేఎస్ భరత్ను ఎంపిక చేశారు.
కేఎల్ రాహుల్కు అతను బ్యాకప్ వికెట్ కీపర్గా సేవలందించనున్నాడు. వన్డే సిరీస్లో వేలి గాయానికి గురైన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్
సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్ట్లో రోహిత్ శర్మకు జతగా యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన యశస్వీ తొలి మ్యాచ్లోనే సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించి టీమిండియా రికార్డు విజయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు.

ఫస్ట్ డౌన్లో శుభ్మన్ గిల్..
యశస్వీ ఓపెనర్గా బరిలోకి దిగడంతో శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. చతేశ్వర్ పుజారా లోటును తీర్చే బాధ్యత శుభ్మన్ గిల్కు అప్పగించారు. వెస్టిండీస్ పర్యటనలో ఫస్ట్ డౌన్లో శుభ్మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. తాజా సిరీస్లోనైనా సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడుతాడు.
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సౌతాఫ్రికాలో ఉండే బౌన్సీ పిచ్లు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు సరిగ్గా సరిపోతాయి.
వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. కేఎస్ భరత్ రూపంలో అతనికి పోటీ ఉన్నా.. రాహుల్కే తొలి ప్రాధాన్యత దక్కనుంది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ సిరీస్లో అతను నెంబర్ 6లో బ్యాటింగ్ చేయనున్నాడు.

అశ్విన్కు నో ఛాన్స్..
వరల్డ్ టెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బరిలోకి దిగనుండగా.. నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. సెంచూరియన్ వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జడేజా, అశ్విన్ కలిసి ఆడలేని పరిస్థితి నెలకొంది.
అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టు తరఫున అతను ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. మహమ్మద్ సిరాజ్ అతని డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
మూడో పేసర్గా ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణలో ఒకరికి చోటు దక్కనుంది. భారత్-ఏ తరఫున 5 వికెట్ల ప్రదర్శనతో పాటు హ్యాట్రిక్ సాధించిన ప్రసిధ్ కృష్ణకే టీమ్మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనుంది.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్
భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ.