IND vs SA 3rd T20I: సౌతాఫ్రికా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వర్షం మింగేయగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. దాంతో ఆ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గురువారం జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగే మూడో టీ20లోనూ భారత్ను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు వర్షం కారణంగా రెండో టీ20లో ఓడిన టీమిండియా.. చివరి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. రెండో టీ20లో టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్లను ఆడించకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.

ఈ క్రమంలో మూడో టీ20లో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ డకౌటవ్వగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన తెలుగు తేజం తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్ను వెనక్కినెట్టి మరీ జట్టులోకి వచ్చిన జితేశ్ శర్మ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు.
కుల్దీప్ యాదవ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో చివరి టీ20లోనూ టీమిండియా మేనేజ్మెంట్ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్తో పాటు తిలక్ వర్మ, జితేశ్ శర్మలపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్ విషయంలోనూ తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్కాంబినేషన్పై ఫోకస్ పెట్టిన టీమిండియా.. ఈ సిరీస్లో గెలుపు ఓటముల కంటే ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది.
శుభ్మన్ గిల్ను తప్పిస్తే రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వస్తాడు. శుభ్మన్ గిల్ను తప్పించుకుండా గైక్వాడ్ను ఆడించాలనుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్ బెంచ్కు పరిమితమవుతాడు. ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మకు బదులు శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో రింకూ సింగ్ బ్యాటింగ్ చేయనున్నాడు.
జితేశ్ శర్మపై వేటు వేస్తే ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్పై వేటు వేసి అతన్ని తుది జట్టులోకి తీసుకోవచ్చు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్లకు తిరుగులేదు. దీపక్ చాహర్ ఇంకా జట్టుతో కలవలేదు. దాంతో భారత పేసర్లకు పోటీనే లేకుండా పోయింది.
భారత తుది జట్టు(అంచనా):
శుభ్మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్/జితేశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్/తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్/ కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్.
భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.