India Playing XI vs SA for 1st T20I: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 4-1తో గెలుచుకున్న టీమిండియా.. సఫారీ గడ్డపై అదే జోరును కొనసాగించాలనుకుంటోంది.
ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సఫారీ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ,జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నారు. వన్డే ప్రపంచకప్ అనంతరం రెస్ట్ తీసుకున్న శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చారు.

దాంతో టీమిండియా తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు తలనొప్పిగా మారింది. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడంతో తిలక్ వర్మను బెంచ్కే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపెనింగ్ స్లాట్తో పాటు మిడిలార్డర్లో చోటు లేకపోవడంతో ఇషాన్ కిషన్ను కూడా ఆడించలేని పరిస్థితి నెలకొంది.
వికెట్ కీపర్గా అతనికి తొలి ప్రాధాన్యత ఇస్తేనే ఇషాన్ కిషన్ తుది జట్టులో కొనసాగుతాడు. లేదంటే జితేశ్ శర్మ జట్టులోకి వస్తాడు. ఓపెనర్గా ఆడించాలనుకున్నా ఇషాన్ కిషన్కు చోటు దక్కుతుంది. ఆసీస్తో జరిగిన చివరి రెండు టీ20ల్లో జితేశ్ శర్మ సత్తా చాటాడు. మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు.
టీమిండియా కాంబినేషన్ ఏంటేంటే..?
వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న శుభ్మన్ గిల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా యశస్వీ జైస్వాల్ ఆడనున్నాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. ఐదో స్థానంలో జితేశ్ శర్మ బరిలోకి దిగనున్నాడు. వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కు ప్రాధాన్యత ఇస్తే.. జితేశ్ శర్మ బెంచ్కు పరిమితమవుతాడు. అప్పుడు ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.
ఆరో స్థానంలో రింకూ సింగ్ బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ల మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కనుంది. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న రవి బిష్ణోయ్కే చోటు దక్కవచ్చు. పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్లతో సిరాజ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా): శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్/జితేశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్/ కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్.
భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.