శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్కు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం పల్లెకెలె మైదానం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్తో భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొటి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కూడా ముగిసింది. గౌతమ్ గంభీర్ను నయా హెడ్ కోచ్గా బీసీసీఐ నియమించగా.. అతను శ్రీలంక పర్యటనతోనే బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ, రోహిత్, జడేజా స్థానాలను భర్తీ చేయడంపై ఫోకస్ పెట్టాడు. టీ20 ప్రపంచకప్ 2026 లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్ను కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఎంపికచేయనున్నాడు. పల్లెకెలె పిచ్ కండిషన్స్ స్పిన్కు అనుకూలంగా ఉన్నాయి. దాంతో టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే మూడో స్పిన్నర్గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగుతాడు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం ఖలీల్ అహ్మద్కు అవకాశం దక్కుతోంది.
హార్దిక్ పాండ్యా రూపంలో మూడో పేసర్ ఉన్న నేపథ్యంలో ఖలీల్ అహ్మద్ బెంచ్కే పరిమితమవుతాడు. అయితే శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నలుగురిలో ఒక్కరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కనుంది. స్పిన్ను సమర్థవంతంగా ఆడటంతో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న శివమ్ దూబేకు అధిక ప్రాధాన్యత దక్కనుంది.
ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్కు బదులు అదనపు బ్యాటర్ తీసుకుంటే సంజూ శాంసన్, రింకూ సింగ్లో ఒకరు ఆడుతారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆడనుండగా.. మిడిలార్డర్లో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆడనుండగా.. అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవి బిష్ణోయ్కు ఎక్స్ట్రా స్పిన్నర్గా అవకాశం దక్కవచ్చు.
శ్రీలంకతో తొలి టీ20 తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్/ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్