India vs South Africa: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో ఆసక్తికర పర్యటనకు సిద్దమైంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ల సిరీస్ కోసం సుమారు రెండు నెలలపాటు సౌతాఫ్రికాలో పర్యటించనుంది.
ఇప్పటికే ఈ టూర్కు సంబంధించిన మూడు ఫార్మాట్ల జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రధాన పేసర్లు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు ఈ పర్యటనలోని వైట్బాల్ సిరీస్లకు దూరమయ్యారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేమని బీసీసీఐకి తెలియజేయడంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతినిచ్చారు. రెండు టెస్ట్ల సిరీస్తో ఈ నలుగురు సీనియర్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్లో చీలమండ గాయానికి గురైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.
దాంతో టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్.. వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ పర్యటనలో ముందుగా మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన భారత ఆటగాళ్లు.. బుధవారం లేదా గురువారం(డిసెంబర్ 7) సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నారు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం డర్బన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య సౌతాఫ్రికాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే ఈ సిరీస్ జరగనుంది. అయితే తొలి మ్యాచ్ ఆడే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
స్టార్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో తుది జట్టు ఎంపిక సవాల్గా మారింది. కుర్రాళ్లనే కొనసాగిస్తారా? లేక స్టార్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. సౌతాఫ్రికాపై రాణించాలంటే అనుభవం కూడా చాలా ముఖ్యం.
కాబట్టి సీనియర్ ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటేనే ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించనున్నారు. లేదంటే అతను మిడిలార్డర్లో ఆడనున్నాడు.
ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగితే మాత్రం యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ల్లో ఒకరు శుభ్మన్ గిల్కు జతగా ఆడనున్నారు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్తో పాటు శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.
పేస్ పిచ్లను పరిగణలోకి తీసుకోని ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితమవుతాడు. మహమ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. దీపక్ చాహర్, ముఖేష్ కుమార్లతో కలిసి అతను పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.
ఎక్స్ట్రాపేసర్ కావాలనుకుంటే అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. స్వింగ్ చేయగల సామర్థ్యంతో పాటు లోయరార్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న దీపక్ చాహర్కు అర్ష్దీప్ సింగ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత లభించనుంది. జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్లు బెంచ్కే పరిమితం కానున్నారు.
భారత తుది జట్టు(అంచనా): శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్/ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/అర్ష్దీప్ సింగ్.
భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.