హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో అసలు సిసలు పోరు అయిన దాయాదీల సమరం కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.
బీసీసీఐ సైతం ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్కు ముందు ఆరంభ వేడుకలను నిర్వహించనుంది. లక్ష మంది అభిమానులు హాజరయ్యే ఈ మ్యాచ్లో కళ్లు జిగేల్మనే లేజర్ షోతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆట పాట కనువిందు చేయనుంది. ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి.

శుభ్మన్ గిల్ రీఎంట్రీ..
పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. గురువారమే అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా శుక్రవారం సాధన చేయనుంది. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ పూర్తిగా కోలుకున్నాడు. టీమిండియా కన్నా ముందే అహ్మదాబాద్ చేరుకున్న అతను గురువారం ప్రాక్టీస్ ఆరంభించాడు. సుమారు గంటపాటు అతను బ్యాటింగ్ సాధన చేశాడు.
తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ వేదికగానే రీఎంట్రీ ఇచ్చేందుకు గిల్ రెడీ అవుతున్నాడు. అతని రీఎంట్రీతో టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం శుభ్మన్ గిల్ ఆడటంపై టీమిండియా మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది. గిల్ రీఎంట్రీ ఇస్తే ఇషాన్ కిషన్ బెంచ్కు పరిమితం కానున్నాడు.

బౌలింగ్ కాంబినేషన్లో కీలక మార్పు..
బౌలింగ్ కాంబినేషన్లోనూ స్వల్ప మార్పులు చేయనున్నారు. పిచ్ కండిషన్స్ స్పిన్కు అనుకూలంగా ఉంటే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం అశ్విన్ బెంచ్కే పరిమితమవుతాడు.

సిరాజ్ డౌట్..
అఫ్గానిస్థాన్తో మ్యాచ్లో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. పాకిస్థాన్తో మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి ఉండనున్న నేపథ్యంలో సిరాజ్ స్థానంలో అనుభవం కలిగిన మహమ్మద్ షమీని ఆడించే అవకాశాలున్నాయి. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అఫ్గాన్తో శ్రేయస్ అయ్యర్ రాణించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు.
పాక్తో బరిలోకి దిగనున్న భారత్ జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/మహమ్మద్ షమీ.