క్యాండీ: యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ ప్రపంచంలో దాయాదుల పోరును మించిన మ్యాచే లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండటంతో భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఆసియాకప్ 2023లో భాగంగా దాయాదీ దేశాలు శనివారం క్యాండీ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. దాంతోనే ఆసియాకప్ హైఓల్టేజ్ పోరులో ఎవరు? ఫేవరేట్ అనేది చెప్పడం కష్టంగా మారింది. గతంలో భారత బ్యాటర్లు, పాకిస్థాన్ బౌలర్ల మధ్యనే పోరు ఉండేది.

అయితే ఈ సారి కూడా అదే రిపీట్ కానుంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీష్ రౌఫ్ల బౌలింగ్.. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. టీమిండియాలో నెంబర్ 4లో ఆడనున్న శ్రేయస్ అయ్యర్ కీలకం కానుండగా.. పాకిస్థాన్లో షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ ప్రదర్శనపై ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెంబర్ 4లో బ్యాటింగ్ చేసిన అయ్యర్ 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా అతను గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను మునపటిలా చెలరేగితే భారత్కు తిరుగుండదు. బ్యాటింగ్లో డెప్త్ ఉండటం పాకిస్థాన్కు కలిసొచ్చే అంశం కాగా.. భారత్కు బలహీనతగా మారింది.
రవీంద్ర జడేజా తర్వాత బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన టెయిలెండర్లు భారత జట్టులో లేరు. పాకిస్థాన్తో మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎంపిక విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్ను తీసుకోవాలనుకుంటే మహమ్మద్ షమీని పక్కనపెట్టాలి. అప్పుడు పేస్ బాధ్యతలు పూర్తిగా బుమ్రా, సిరాజ్లపైనే పడనున్నాయి.
ఓపెనర్గా మెరుగైన రికార్డు ఉన్న ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఎలా రాణిస్తాడో చూడాలి. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడే ఫినిషర్ పాత్ర పోషించనున్నారు.
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీల్లో ఒకరికి అవకాశం దక్కనుంది.
పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మహమ్మద్ నవాజ్ స్థానంలో ఫాహిమ్ అష్రఫ్ తీసుకురావాలని ఆ జట్టు భావించినా.. భారత్లో ఐదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్ననేపథ్యంలో మార్పు చేయకపోవచ్చు.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ .