టీ20 ప్రపంచకప్ 2024లో అసలు సిసలు సమరానికి సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థుల భారత్, పాకిస్థాన్ మధ్య నేడు(ఆదివారం) జరిగే హైఓల్టేజ్ మ్యాచ్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ బిగ్ మ్యాచ్కు న్యూయార్క్లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది.
తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై సునాయస విజయం అందుకున్న టీమిండియా ఉత్సాహంగా కనిపిస్తుండగా.. పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అమెరికాలో క్రికెట్కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ మ్యాచ్కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది.

కలవరపెడుతున్న పిచ్..
న్యూయార్క్ ఫ్యాన్స్ కోసం తక్కువ సమయంలోనే 34 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన స్టేడియాన్ని నిర్మించింది. అయితే ఈ మైదానం పిచ్పై విమర్శలు వస్తున్నాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కంటే పిచ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నాసా కౌంటీ మైదానంలోని డ్రాప్ ఇన్ పిచ్లు బ్యాటింగ్కు ప్రమాదకరంగా ఉండటమే ఇందుకు కారణం.
అనూహ్య బౌన్స్, స్వింగ్తో బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గాయాల పాలవుతున్నారు. ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ, రిషభ్ పంత్ల మోచేతికి బంతి బలంగా తాకింది. ఈ గాయంతో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ టోర్నీ కోసం మొత్తం నాలుగు పిచ్లు సిద్దం చేశారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ను కొత్త పిచ్పై ఆడించనున్నారు.
కుల్దీప్కు ఛాన్స్..?
ఈ క్రమంలోనే భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో అతను బరిలోకి దిగవచ్చు. ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే సిరాజ్పై వేటు పడే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం లేదనకుంటే ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగనుంది.
టాపార్డర్లో రోహిత్, కోహ్లీ, పంత్ ఆడనుండగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలు బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్లో విఫలమైనా పాక్తో ఎలా ఆడాలో కోహ్లీకి బాగా తెలుసు. పవర్ ప్లేలో భారత ఓపెనర్లు షాహిన్ అఫ్రిది, మహమ్మద్ అమీర్లను జాగ్రత్తగా ఆడితే భారత్కు తిరుగుండదు.
ఒత్తిడిలో పాక్..
అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని అందుకున్న పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆ జట్టు ఓటమి కంటే ఆటతీరే అభిమానులను కలవరపెడుతోంది. బ్యాటింగ్ విభాగం చాలా బలహీనంగా ఉంది. బౌలర్లు షాహిన్ అఫ్రిది, రౌఫ్, నసీమ్ షా మునపటిలా సత్తా చాటలేకపోతున్నారు. 2021 ప్రపంచకప్లో మినహా ప్రతీసారి భారత్ చేతిలో భంగపడిన టీమ్ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి.
తుది జట్లు(అంచనా):
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్(కెప్టెన్), ఉస్మాన్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, మహమ్మద్ అమీర్, నసీం షా.