హైదరాబాద్: ఆసియాకప్ 2023లో సూపర్-4కు చేరిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం దాయాదీ పాకిస్థాన్తో జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య లీగ్ దశలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే కొలంబో వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారని ప్రచారం జరుగుతున్నా ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా కొలంబో వేదికగా షెడ్యూల్ చేసిన సూపర్-4 మ్యాచ్లను వర్షాలు లేని హంబంటోటాకు తరలించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని కూడా ఏసీసీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో వేదిక మార్పు జరగలేదని ప్రచారం జరుగుతోంది. వర్షం కారణంగా ఆసియాకప్ మ్యాచ్లు రద్దవుతుండటంతో ఆతిథ్యం దేశమైన తమకు నష్టాలు వస్తున్నాయని, పరిహారం ఇవ్వాలని పీసీబీ ఛైర్మన్ డిమాండ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కొలంబోలో 75 శాతం వర్షం వచ్చే అవకాశం ఉండటంతో భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే భారత తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు సవాల్గా మారింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫిట్ అయ్యి జట్టుతో కలవడంతో తుది జట్టులో ఎవర్నీ ఆడించాలనేది తలనొప్పిగా మారింది. రాహుల్ కోసం సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను పక్కనపెట్టలేని పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్తో తీవ్ర ఒత్తిడిలో ఇషాన్ కిషన్ అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు.

హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. అంతేకాకుండా లెఫ్టాండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం. దాంతో అతన్ని పక్కనపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచకప్ ముందు రాహుల్ ఫామ్ను పరీక్షించాలంటే అతన్ని తుది జట్టులోకి తీసుకోవాల్సిందే. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రాహుల్ను తుది జట్టులోకి తీసుకోవడమే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్.
ఇక బౌలింగ్ విభాగంలోనూ మార్పులు జరగనున్నాయి. కొడుకు పుట్టాడని స్వదేశం వెళ్లిన జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో కలిసాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో అతను బరిలోకి దిగనున్నాడు. అతను రీఎంట్రీ ఇస్తే మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్లో ఒకరిని పక్కనపెట్టనున్నారు. బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచిస్తే షమీ ఉద్వాసనకు గురవుతాడు. మిగతావారి విషయంలో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు.

పాకిస్థాన్తో భారత్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్/శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.