ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో ఇప్పటికే సూపర్ -4 బెర్త్ను ఖరారు చేసుకున్న టీమిండియా చివరి లీగ్ మ్యాచ్కు సిద్దమైంది. శుక్రవారం అబుదాబి వేదికగా జరిగే మ్యాచ్లో ఒమన్తో టీమిండియా తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. భారత్ ధాటికి యూఏఈ, పాకిస్థాన్ ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి.
ఒమన్తో పోరు కూడా ఏకపక్షంగానే సాగనుంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. అయితే నామమాత్రపు పోరులో కూడా టీమిండియా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోక దిగే ఛాన్స్ ఉంది. జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వస్తాడు. అంతే తప్పా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇష్టపడడు. టీమిండియా రిథమ్ దెబ్బతినకూడదని అతని ప్రధాన ఉద్దేశం. టీ20ల్లో బుమ్రా వేసేది నాలుగు ఓవర్లే కాబట్టి అతనిపై పెద్దగా భారం పడే అవకాశాలు లేవు.

విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తే తొలి రెండు మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన జితేష్ శర్మ, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలనుకుంటే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే టీమిండియా ఎక్స్ట్రా పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబేతో బరిలోకి దిగుతోంది. అతను తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. శివమ్ దూబే కారణంగా టీమిండియాకు అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ డెప్త్ లభించనుంది.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ దుమ్మురేపుతున్నారు. ఫియర్లెస్ అప్రోచ్తో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుతున్నారు. యూఏఈతో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్.. పాకిస్థాన్తో మాత్రం విఫలమయ్యాడు. మరోవైపు రెండు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మకు పాక్తో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. తమ సత్తా చాటారు.
శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్లకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ రెండు మ్యాచ్ల్లోనే 7 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 4 వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీ ఆశించిన రీతిలో వికెట్లు పడగొట్టకపోయినా.. కట్టడిగా బౌలింగ్ చేశాడు. బుమ్రా, హార్దిక్, శివమ్ దూబే మెరుగ్గా బౌలింగ్ చేశారు. కాబట్టి విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా/అర్ష్దీప్ సింగ్