
ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, పృథ్వీ షా..
రంజీ ట్రోఫీ 2023లో విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మళ్లీ భారత జట్టు పిలుపునందుకున్న పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. సెహ్వాగ్ తరహాలో ధాటిగా ఆడగలిగే పృథ్వీ షా.. శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
వన్డే క్రికెట్లో భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు టీ20ల్లోనూ వరుస అవకాశాలు ఇవ్వనున్నారు. ఈ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ పెద్దగా రాణించకున్నా.. ప్రస్తుత ఫామ్ అతనికి కలిసొచ్చే అంశం. వికెట్ కీపింగ్ చేయనున్న ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇషాన్ ఓపెనర్గా బరిలోకి దిగితే మాత్రం పృథ్వీ షా బెంచ్కే పరిమితం అవుతాడు.

మిడిలార్డర్లో త్రిపాఠి, సూర్య..
మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి ఆడనున్నాడు. శ్రీలంకతో మూడో టీ20లో త్రిపాఠి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. నాలుగో స్థానంలో టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్య బరిలోకి దిగనున్నాడు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో దారుణంగా విఫలమైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 సిరీస్లో రాణించడం చాలా ముఖ్యం. టీ20 ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన సూర్య.. ఆ సిరీస్కు కాన్ఫిడెన్స్గా వెళ్లాలంటే ఈ టీ20 సిరీస్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి.

ఆల్రౌండర్లుగా హార్దిక్, దీపక్ హుడా..
ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. శ్రీలంకతో సిరీస్లో ఈ ఇద్దరూ లోయర్ ఆర్డర్లో అదరగొట్టారు. ముఖ్యంగా హార్దిక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్గా అతనిపై అదనపు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో అటు బంతి, ఇటు బ్యాట్తో రాణించాల్సిన అవసరం ఉంది.
ఇక దీపక్ హుడా సైతం బ్యాట్తో పాటు బంతితో రాణించాల్సిన అవసరం ఉంది. పృథ్వీ షా జట్టులోకి వస్తే మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బెంచ్కే పరిమితం అవుతాడు. లేకుంటే సుందర్కు అవకాశం దక్కుతుంది.
బౌలర్లుగా ఉమ్రాన్, అర్ష్దీప్, శివమ్ మావి..
అర్ష్దీప్ సింగ్ భారత పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు అతనికి సహకరించనుండగా.. హార్దిక్ పాండ్యా సాయంగా ఉండనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లో దారుణంగా విఫలమైన విమర్శలు ఎదుర్కొన్న అర్ష్దీప్ సింగ్ ఈ సిరీస్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఉమ్రాన్ మాలిక్.. తన పేస్తో వికెట్లు తీస్తున్నా పొదుపుగా బౌలింగ్ చేయాల్సి ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్లో శివమ్ మావి సత్తా చాటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయం.

భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్/పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్


Click it and Unblock the Notifications












