న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గౌహతి వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో న్యూజిలాండ్తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. న్యూజిలాండ్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
తాజా మ్యాచ్లోనూ అదే జోరును కనబర్చి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీకి సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్ను ఇరు జట్లు తమ సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్పై వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడనుండగా.. శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఆడనున్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు సంజూకు అండగా నిలవాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తే మూడో టీ20లోనూ సంజూ కొనసాగుతాడు.
తిలక్ వర్మ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. తొలి మ్యాచ్లో విఫలమైనా.. రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు. అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కొనసాగనున్నారు. ఈ ఇద్దరూ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నారు. రెండో టీ20లో హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో అతను మూడో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. అర్ష్దీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రెండో టీ20లో అర్ష్దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ తీయకపోగా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన అక్షర్ పటేల్.. ఈ మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్)/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.