India Playing XI vs Netherlands: వన్డే ప్రపంచకప్ 2023లో తిరుగులేని ప్రదర్శనతో వరుసగా 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలిచిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్కు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్న టీమిండియాకు ఇది నామమాత్రపు మ్యాచే. గెలిచినా.. ఓడినా జట్టుకు ఒరిగేదేం లేదు. నాకౌట్ పోరుకు ముందు ఈ మ్యాచ్ ఓ ప్రాక్టీస్ లాంటిది. మరోవైపు నెదర్లాండ్స్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. టేబుల్ టాపర్ అయిన టీమిండియాను ఓడించి సగర్వంగా టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.

ఇప్పటికే బెంగళూరు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ మ్యాచ్లోనూ టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గాయం కారణంగా హార్దిక్ దూరం కాగా.. అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. కీలక పోరుకు ముందు బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకున్నా.. ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని భావించినా ఒకటి, రెండు మార్పులు జరగవచ్చు.
వరుసగా 8 మ్యాచ్లు ఆడిన జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి ప్రసిధ్ కృష్ణను ఆడించవచ్చు. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ను ఆడించాలని భావిస్తే శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అయ్యర్లలో ఒకరు బెంచ్కు పరిమితం అవుతారు. టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరమే లేదు. బుమ్రాతో పాటు సిరాజ్కు కూడా రెస్ట్ ఇవ్వాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు.

స్పిన్నర్లలో అశ్విన్ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్కు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కీలక సెమీఫైనల్ ముందు టీమిండియా మేనేజ్మెంట్ అనవసరం ప్రయోగాలు చేయకపోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించేందుకే రోహిత్ మొగ్గు చూపవచ్చు.
నెదర్లాండ్స్తో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా/ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్/శార్దూల్ ఠాకూర్