డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన జస్ప్రిత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఆతిథ్య ఐర్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 విజయంతో జోరు మీదున్న టీమిండియా.. అదే ఉత్సాహంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు రెండో మ్యాచ్లోనైనా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఐర్లాండ్ భావిస్తోంది. తొలి టీ20కి వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఫలితాన్ని డక్వర్త్ లూయిస్ ప్రకారం తేల్చారు. మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పాటు ఓపెనర్లు సత్తా చాటడంతో టీమిండియా డీఎల్ఎస్ పద్దతిలో 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఆసియాకప్ 2023 ముందు మెరుగైన ప్రదర్శన చేయాలనుకున్న బ్యాటర్లకు వర్షం కారణంగా నిరాశే ఎదురైంది. రెండో టీ20కి కూడా వర్ష సూచన ఉంది. ఇక 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా(2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కెప్టెన్గా కూడా సత్తా చాటాడు. రెండో టీ20లో టీమిండియాకు పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.
అర్ష్దీప్ సింగ్ దారుణంగా విఫలమైనా అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ అతన్ని పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రింకూ సింగ్కు వర్షం కారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.
కనీసం రెండో టీ20లోనైనా అతనికి బ్యాటింగ్ అవకాశం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ టీ20లో ప్రసిధ్ కృష్ణ అదరగొట్టాడు. గాయంతో చాలా రోజులు జట్టుకు దూరమైన అతను ఇదే మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు మరో అవకాశం దక్కనుంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ సత్తా చాటాడు. అతని చోటుకు డోకా లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జితేశ్ శర్మ, షెహ్బాజ్ అహ్మద్ మరో మ్యాచ్ వరకు నిరీక్షించాల్సిందే.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్